YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పార్టీపై బిగిస్తున్న రేవంత్ పట్టు

పార్టీపై బిగిస్తున్న రేవంత్  పట్టు

హైదరాబాద్, జూన్ 27,
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రమంగా పార్టీపైన పట్టుబిగించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ కు ఎవరూ శత్రువులుండరు. ఆ పార్టీ నేతలే. ఇది ఇప్పుడు మొదలయింది కాదు. దేశంలో ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా లేకపోయినా పైకి పార్టీ లేచే కొద్దీ కిందకు లాగే వాళ్లు ఎక్కువ మంది ఉంటారు. అందుకే చాలా మంది చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ప్రత్యర్థి పార్టీల నేతల కంటే సొంత పార్టీ నేతలకే ఎక్కువ భయపడుతుంటారు. అందుకు కారణం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తమ కారణంగానే నని భావించి తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటారు. ఎమ్మెల్యే టిక్కెట్ రాకపోతే.. ఎమ్మెల్సీని అడుగుతారు. అదిఇస్తే మంత్రి పదవి సంగతేంటని ప్రశ్నిస్తారు. కుటుంబంలో ఒకరికి టిక్కెట్ ఇచ్చి మంత్రిపదవిని ఇచ్చినా మిగిలిన కుటుంబ సభ్యుల మాటేంటని నిలదీస్తారు. ఇక ఎప్పుడూ ప్రత్యక్ష్య ఎన్నికల్లో పోటీ చేయని వారు, వారి వల్ల ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ గుర్తుపై వేయించలేని వారు సయితం తమకు పదవులకు కావాలని కోరతారు. కోరడమే కాదు గాంధీభవన్ లో కూర్చుని మరీ డిమాండ్ చేస్తారు. ఏకంగా మీడియా సమావేశం పెట్టి సొంత పార్టీ పైన, ప్రభుత్వంపైన విమర్శలు చేయడానికి కూడా వెనుకాడరు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ పాదయాత్రతో కాంగ్రెస్ సుదీర్ఘకాలం తర్వాత అధికారంలోకి వచ్చినా ఆ విజయం తమవల్లనేనంటూ డప్పాలుకొట్టుకున్న వారు అనేక మంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కూడా అసంతృప్తుల బెడద 2004 ముందు నుంచి ఆయన మరణించేంత వరకూ తప్పలేదు. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటయి రెండేళ్లు కావస్తుండటంతో ఇప్పటి వరకూ పార్టీ విషయాలను పెద్దగా పట్టించుకోలేదు. ఆయన ఎక్కువగా పాలనపైనే ఫోకస్ పెట్టారు. మంత్రి వర్గ విస్తరణ కూడా పూర్తి కావడంతో పాటు స్థానికసంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. నియోజకవర్గ స్థాయి నేతలు కూడా మీసాలు మెలేస్తుండటం, సీనియర్ నేతలపైనా, మంత్రులపైనా విమర్శలు చేస్తుండటంతో రేవంత్ రెడ్డి పార్టీ అధినాయకత్వంతో మట్లాడి క్రమశిక్షణ కమిటిని నియమించుకున్నారు.క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ గా ఉన్న వారు సయితం తమ ఇలాకాలో సొంత పార్టీ నేతలను విమర్శలు చేయడం కొంత ఇబ్బందిగా మారింది. పీసీసీ అధ్యక్షుడి హోదాలో మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న హెచ్చరికలు పెద్దగా పనిచేయడంలేదు కాంగ్రెస్ లో క్రమశిక్షణ కమిటీ అనేది ఒక బ్రహ్మపదార్థం. 1999లో ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్. కృష్ణా జిల్లా పర్యటనకు రోడ్డు మార్గాన బయలుదేరి వచ్చారు. జగ్గయ్య పేట అడ్డరోడ్డువద్ద సామినేని ఉదయభాను అనుచరులు మరొక కాంగ్రెస్ నేతను చితక బాదారు. ఆ నేత వైఎస్ కారులో ఉన్నా సరే కారు అద్దాలు బద్దలు కొట్టి బయటకు లాగి కొట్టారు. వెంటనే నందిగామలోని వసంత నాగేశ్వరరావు ఇంట్లో మీడియా సమావేశం పెట్టిన వైఎస్ సామినేని ఉదయభానును ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆరు నెలలకు తిరక్కముందే జరిగిన ఎన్నికల్లో ఉదయ భానుకు టిక్కెట్ వచ్చింది. 1999లో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. తనకు బాగా సన్నిహితుడైన నాగర్ కర్నూలు ఎంపీ మల్లురవిని క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ గా నియమించారు.ఈ కమిటీ బెదిరింపులకు కాంగ్రెస్ నేతలు తలొగ్గుతారా? తోకముడుస్తారా? అంటే నవ్వడం మినహా మరొక సమాధానం రాదు. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ అంటే కోరలు లేని పాము వంటిదని కార్యకర్తల నుంచి నేతల వరకూ అందరికీ తెలుసు. అందుకే ఇప్పుడు ఏర్పడిన క్రమశిక్షణ కమిటీ పార్టీ నేతలపై చర్యలు తీసుకుంటారని భావించడం అత్యాశే అవుతుంది. కొండా మురళిపైనో, మరొకరిపైనో వేటు వేసే ధైర్యం కాదు..కాదు... నిర్ణయం తీసుకునే హక్కు ఈ కమిటీకి లేదనే చెప్పాలి. అందుకే హస్తం పార్టీ అలా ఎప్పుడూ వెలిగిపోతుంది.

Related Posts