
కాకినాడ, జూలై 8,
గోదావరి జిల్లాల్లో వయాగ్రా, అబార్షన్ టాబ్లెట్ల అడ్డగోలు అమ్మకాలు యదేఛ్చగా కొనసాగుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. మెడికల్ షాపుల్లో సోదాలు చేసి పాత రికార్డ్స్ కూడా పరిశీలిస్తున్నారు. తనిఖీల్లో అనేక షాకింగ్ విషయాలు బైటికొస్తున్నాయి. అబార్షన్ ట్యాబ్లెట్స్ అమ్మకాలు పెంచడానికి సేల్స్మెన్కు టార్గెట్లు పెట్టి మరీ దందాకు పాల్పడుతున్నారు అక్రమార్కులు. ఫార్మా కంపెనీల్లో పనిచేసి మానేసినవాళ్లే మెడికల్ రిప్రజెంటేటివ్స్ ద్వారా వయాగ్రా సేల్స్కి తెగిస్తున్నట్టు తేలింది. టార్గెట్ పూర్తి చేయాలన్న ఒత్తిళ్లు భరించలేక బ్లాక్లో మందులు అమ్ముతున్నారు. అబార్షన్ కిట్లు, వయగ్రా టాబ్లెట్లు అడిగిందే తడవుగా అమ్మిన దుకాణదారులపై చర్యలు తప్పవంటున్నారు అధికారులు. వయాగ్రా… అది షెడ్యూల్డ్ H కేటగిరీకి చెందిన మెడిసిన్ అనీ, ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మనేకూడదని తెలిసినా.. షాపుల్లో మాత్రం అంతా విచ్చలవిడితనమే. కౌంటర్లో చెయ్యి పెట్టి అడిగితే చాలు.. స్టాకు లేకపోయినా తెప్పించి మరీ ఇస్తారు. వయాగ్రా మందులు ఆఫ్లైన్లోనే కాదు ఆన్లైన్లో కూడా విచ్చలవిడిగా అమ్మకమౌతున్నాయి. అక్కడైతే అధికారుల తనిఖీలుండవు, అమ్మే వాళ్లకు కొనేవారు ఎవరో కూడా తెలీదు .. కొన్నవాళ్ళు వాటిని వాడి ఏమైపోతారన్న కనీస స్పృహ కూడా ఉండదు. కొన్ని ప్రతికూల ఎంజైముల్ని నియంత్రించి, రక్తప్రసరణ పెరగడం కోసమే తయారయ్యే మెడిసిన్ వయాగ్రా. ఒక్కో వయసు వారికి ఒక్కో రీతిలో ఉండే బ్లడ్ ఫ్లోను వయాగ్రాతో సమతుల్యం చెయ్యొచ్చు కానీ.. అవగాహన లేకుండా మోతాదుకు మించి వాడితే.. తాత్కాలిక తృప్తి సంగతి అటుంచితే తలనొప్పి, జీర్ణకోశ సమస్యలు, గుండెపోటు లాంటి తీవ్ర సమస్యలు పక్కా. వయాగ్రా.. ఎంత బెటర్మెంట్ ఇస్తుందని ఆశపడతారో.. అంతకంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ బాధపెడతాయ్. హార్ట్ ఎటాక్స్కి దారితియ్యొచ్చు… కిడ్నీలపై చెడుప్రభావం చూపనూవచ్చు. దాంతో ప్రమాదం ఉంది కనుకనే అమ్మకాలపై నియంత్రణ పెట్టారు. దాన్ని మీరి.. విచ్చలవిడిగా విక్రయించడం మొదలైతే…దాన్ని వాడేవాళ్ల మెంటల్ స్టేటస్ను ఎవరూ కంట్రోల్ చెయ్యలేరు. ఇదే ముఠా ఇంకాస్త విజృంభించి సిటీల్లోకి పాకితే పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది కనుక.. ఉక్కుపాదం మోపుతోంది డ్రగ్ కంట్రోల్ విభాగం.