
రంగారెడ్డి, జూలై 16,
స్థానిక సంస్థల ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సమాయత్తం అవుతోంది. ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా నాయకులను, శ్రేణులను సంసిద్ధులను చేయడానికి రంగం సిద్ధం చేసిం ది. ఈమేరకు మంగళవారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధి అవుషాపూర్లో రాష్ట్ర పదాధికారులతో ప్రత్యేక వర్క్ షాపు నిర్వహించింది.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్ ముఖ్య అతిథిగా వచ్చారు. వర్క్షాపునకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి అభయ్పాటిల్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణ తేదీల వారీగా ప్రకటించా రు.ఈనెల 18 నుంచి ఆగస్టు 20వరకు వరుసగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి నామినేషన్లు వేసిన తర్వాత తదుపరి కార్యక్రమాలకు రూపకల్పన చేయనున్నారు. అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ మాదిరిగానే, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే అవినీతి, ప్రజావ్యతిరేక పాలనను కొనసాగిస్తోందని విమర్శించారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను నల్లగొండ, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో మొట్టమొదటి పర్యటన చేశానని, ఈపర్యటనలో వివిధ వర్గాల ప్రజలను కలిసి నట్లు తెలిపారు. గ్రామాల్లో బీజేపీ బలం పెరుగుతోందని, ప్రజలు బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.గతంలో భారతీయ జనతా పార్టీకి ఒక్క ఎమ్మెల్యే, నలుగురు ఎంపీలు మాత్రమే ఉండగా, ఇప్పుడు ఏడుగురు ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉన్నారని, ప్రతీ ఎన్నికలో బీజేపీ ఓటుశాతం, ప్రాతినిధ్యం పెరుగుతోందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలిచేలా విజయసంకల్పంతో ముందుకు సాగాలని, అందుకుకార్యకర్తలు, నాయకులు ముందుకు రావాలని, అందరం కలిసిమెలిసి ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అందులో 10 శాతం మతపరమైన రిజర్వేషన్లను కలుపాలని చూస్తోందని ఇది బీసీలకు వ్యతిరేకమైన చర్య ఉన్నారు. మతపరమైన కారణాల వల్లే ఆనాడు భారతదేశ విభజన జరిగిందన్న విషయాన్ని గుర్తుచేశారు.విద్యా, ఉద్యోగాల్లో మతపరమైన 4 శాతం రిజర్వేషన్లను బీజేపీ గతంలోనే వ్యతిరేకించిందని, కానీ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే విధానాన్ని కొనసాగిస్తోందన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని, ప్రజల కోసం పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచేలా ఇప్పటినుంచే కృషి చేయాలన్నారు.