YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బీఎస్పీలో రాహుల్ తుఫాన్

బీఎస్పీలో రాహుల్ తుఫాన్
త్వరలో జరగబోయే రాజస్థాన్, మహారాష్ట్ర, చత్తీస్గఢ్ రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లో కాంగ్రెస్తో దోస్తీ కోసం బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రయత్నిస్తుంటే ఆ పార్టీ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ ఓడించడానికి అన్ని ప్రధాన పార్టీలు కూటమిగా ఏర్పడాలని భావిస్తుండగా బీఎస్పీ కార్యకర్తలతో సోమవారం జరిగిన సమావేశంలో ఆ పార్టీ జాతీయ- ఉపాధ్యక్షుడు జై ప్రకాశ్ సింగ్ రాహుల్పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కొనే సత్తా కేవలం తమ అధ్యక్షురాలు మాయావతికి మాత్రమే ఉందన్న ఆయన, 2019 లోక్సభ ఎన్నికల్లో విపక్షాల తరఫున ఆమే ప్రధాన మంత్రి అభ్యర్థని పేర్కొన్నారు. అంతేకాదు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీకి కూడా ఆ పదవి దక్కదని, ఎందుకంటే ఆయనలో ఉన్నది విదేశీ రక్తమని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీ వైఖరిని తెలియజేయడానికి పార్టీ కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సమావేశంలో జై ప్రకాశ్ పై విధంగా స్పందించారు. వారసత్వ రాజకీయాలపై విమర్శలు గుప్పించిన ఆయన, రాహుల్ గాంధీ కూడా తన తండ్రి, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ మాదిరిగానే ప్రధాని పదవిపై ఆశలు పెంచుకున్నారని అన్నారు. ‘రాహుల్ తన తల్లి సోనియా అడుగుజాడల్లో నడుస్తున్నారు... ఆమె ఓ విదేశీయురాలు.. కాబట్టి ఆయన భారత రాజకీయాల్లో విజయవంతం కాలేరు.. రాజునేవాడు రాణి నుంచి జన్మించడు.. రాబోయే తరం నాయకుడు రాణి గర్భంలో నుంచి కాదు బ్యాలెట్ బాక్సుల నుంచి పుట్టుకొస్తాడు’ అని పేర్కొన్నారు. దేశ ప్రధాని అయ్యేందుకు మాయావతికి మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కర్ణాటకలో కుమారస్వామిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడంలో మాయావతి ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోదీ, అమిత్షాల ప్రభావాన్ని ఎదుర్కొనే ఏకైక దబాంగ్ నేత మాయావతి మాత్రమే, కేవలం దళితుల నుంచే కాకుండా అన్ని వర్గాల నుంచి ఆమెకు మద్దతు ఉందని అన్నారు. సమయం వస్తే ఆమే ప్రధాని అవుతారు... కింది స్థాయి నుంచి వచ్చిన మాయ నాలుగు సార్లు యూపీ సీఎంగా పనిచేశారని జై ప్రకాశ్ గుర్తుచేశారు. మరోవైపు బీజేపీ హిందూత్వ సిద్ధాంతాలపై కూడా జై ప్రకాశ్ సింగ్ విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో అధికారం కీలకమైనది.. కొందరు మతం పేరు చెప్పుకుని తమ కలలను నేరవేర్చుకుని అధికారం పొందారని ఎద్దేవా చేశారు. అధికారానికి ఉద్యోగాలు, ఆలయాలు, వ్యాపారాలు, సంస్థల్లో లేదు.. ఒకవేళ ఇది ఆలయాల్లో ఉంటే యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ మఠం నుంచి వచ్చి, సీఎం అయ్యేవారు కాదు.. అధికారం కేవలం ఒక్కే ఒక్క చోటు ఉంది.. అది రాజకీయాలే’ అని విమర్శలు గుప్పించారు. బీఎస్పీ నేత వ్యాఖ్యలపై స్పందించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు నిరాకరించారు. అయితే జై ప్రకాశ్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాయావతి, ఆయనను జాతీయ ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఆయన వ్యాఖ్యలు బీఎస్పీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఇతర పార్టీల నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయరాదని సూచించారు. అంతేకాదు జై ప్రకాశ్ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై రాజ్యసభ బీజేపీ ఎంపీ అనిల్ బలౌనీ స్పందించారు. ‘ప్రధాని కావాలి అని ఎవరైనా కలలు కనొచ్చు.. లోక్సభలో 44 సీట్లు ఉన్న రాహుల్ గాంధీ, ఒక్క సీటు కూడా లేని మాయావతి లాంటి వాళ్లు కూడా ఆశపడవచ్చు’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Related Posts